navageetam.com
Newspaper Banner
Date of Publish : 12 May 2026, 8:13 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కనులపండువగా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు

స్వామివారిని దర్శించుకున్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు

నవగీతం, కోరుట్ల ప్రతినిధి:

కోరుట్ల పట్టణంలోని 6వ వార్డు ఏకిన్ పూర్ శివారు పంచముఖ హనుమాన్ ఆలయం మంగళవారం భక్తిపారవశ్యంలో మునిగితేలింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఆలయంలో పెద్ద హనుమాన్ జయంతోత్సవాలను వార్డు ప్రజలు, భక్తులు అత్యంత వైభవంగానిర్వహించారు. ఈ వేడుకలు కనులపండువగా జరగడమే కాకుండా, ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు హాజరయ్యారు. వారితో పాటు కోరుట్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మాజీ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి, నాయకులు సరికెల్లా నరేష్, మరిపెల్లి జనార్దన్స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి మంగళహారతులతో వేద ఆశీర్వచనాలు అందజేశారు. లోక కల్యాణం కోసం, నియోజకవర్గ ప్రజల సుఖసంతోషాల కోసం భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. పూజా కార్యక్రమాల అనంతరం స్థానిక వార్డు కౌన్సిలర్మేడిపల్లి శిరీష శేఖర్ రెడ్డి అతిథులను కండువాలతో కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వందలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రసాదాన్ని స్వీకరించారు. హనుమన్నామ స్మరణతో ఏకిన్ పూర్ వీధులన్నీ మారుమోగిపోయాయి. భక్తుల సౌకర్యార్థం కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేయడంతో ఉత్సవం దిగ్విజయంగా ముగిసింది.ఈ కార్యక్రమంలో వార్డు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కాశిరెడ్డి వెంకటా రెడ్డి, సీనియర్ నాయకులు బన్న రాజేష్, జాగిలాం భాస్కర్, మ్యాదరి లక్ష్మణ్, శనిగరపు రాజేందర్, మ్యాదరి అరుణ్ కుమార్, జాగీలం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.