నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా గ్రీవెన్స్ డే కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రజల నుండి వచ్చిన పలు ఫిర్యాదులను స్వయంగా పరిశీలించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 16 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను వివరంగా తెలుసుకున్నారు.ప్రతి ఫిర్యాదును న్యాయబద్ధంగా, పారదర్శకంగా విచారించి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చట్ట పరిధిలో పరిష్కరించగల సమస్యలను ఆలస్యం లేకుండా వెంటనే పరిష్కరించాలని, విచారణ ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రజలకు పోలీస్ శాఖ మరింత చేరువ కావాలనే లక్ష్యంతో ప్రజా సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేస్తున్నామని తెలిపారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి వినతులను స్వీకరించి, క్షేత్రస్థాయి పరిశీలన చేసి తక్షణ స్పందన అందిస్తున్నామని పేర్కొన్నారు.