navageetam.com
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 3:02 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

నూతన ప్రభుత్వ కార్యాలయ భవనాలతో ప్రజలకు మెరుగైన సేవలు

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

జగిత్యాల,ఆగస్టు21,(నవగీతం):జిల్లాలో నూతనంగా మంజూరైన ప్రభుత్వ కార్యాలయ భవనాల నిర్మాణంతో ప్రజలకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేందుకు అవకాశం కలుగుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ధరూర్ క్యాంప్‌లో నూతనంగా మంజూరైన పలు ప్రభుత్వ కార్యాలయ భవనాల నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్ధులు, వికలాంగుల మరియు ట్రాన్స్‌జెండర్ సాధికారిత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌,జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, సి.సి.ఎల్.ఏ. కమిషనర్ లోకేష్ కుమార్, స్పెషల్ సెక్రటరీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ రాజీవ్ గాంధీ హనుమంతు, ఎం.డి.హౌసింగ్ గౌతం,జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ లతో కలిసి శంకుస్థాపన చేశారు.

జగిత్యాల రెవెన్యూ డివిజనల్ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.2.25 కోట్ల అంచనా వ్యయంతో , మెట్‌పల్లి రెవెన్యూ డివిజనల్ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.2.25 కోట్ల నిధులు, భీమారం తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.2.25 కోట్ల అంచనా వ్యయంతో,ఎండపల్లి తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.2.25 కోట్ల నిధులు, మాల్యాల సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.1.40 కోట్ల అంచనా వ్యయంతో, మెట్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.1.40 కోట్ల నిధులు మొత్తంగా ఆరు ప్రభుత్వ కార్యాలయ భవనాల నిర్మాణానికి రూ.11.80 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా జగిత్యాల,మెట్‌పల్లి రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు,భీమారం,ఎండపల్లి తహసీల్దార్ కార్యాలయాలు,మాల్యాల,మెట్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఆధునిక సౌకర్యాలతో నూతన కార్యాలయ భవనాలను నిర్మించడం ద్వారా ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలను మరింత సులభంగా, సౌకర్యవంతంగా అందించేందుకు వీలవుతుందని మంత్రి పేర్కొన్నారు.

ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల్లో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు, అధికారులు మరియు సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు అనువైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.నూతన భవనాల నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.రెవెన్యూ, రిజిస్ట్రేషన్ తదితర శాఖల సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు. కార్యాలయాల నిర్మాణంలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు.జిల్లాలో పరిపాలనా సౌకర్యాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమాల్లో శాసన మండలి సభ్యులు ఎల్ .రమణ,చొప్పదండి శాసనసభ్యులు మేడిపెల్లి సత్యం,వెలమ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగారావు,అదనపు కలెక్టర్ లు బి. ఎస్ లత, బి.రాజ గౌడ్,జగిత్యాల జిల్లా గ్రంథాలయం చైర్మన్ సంఘనభట్ల దినేష్, జగిత్యాల,మెట్ పెల్లి, కోరుట్ల ఆర్డీవోలు మధుసూదన్,నరసింహ రావు, జీవాకర్ రెడ్డి, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ నాగజ్యోతి, మెట్ పెల్లి మున్సిపల్ చైర్మన్, కోరుట్ల మున్సిపల్ చైర్మన్,రాయికల్ మున్సిపల్ చైర్మన్, ఆయా మండలాల స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.