జిల్లా కలెక్టర్ను కోరిన ఎంపీ ధర్మపురి అర్వింద్
నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ను పలు కీలక అంశాలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ సమావేశంలో పాల్గొంటున్న ఆయన, భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం చరవాణి ద్వారా కలెక్టర్ తో మాట్లాడారు.మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖ, వాటర్ సప్లై, విద్యుత్ శాఖ, ఆర్ అండ్ బీ జాతీయ రహదారుల సంస్థ తో పాటు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు.అలాగే జిల్లాలోని చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల బలహీనంగా ఉన్న కట్టలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ను కోరారు. వాతావరణ శాఖ రానున్న రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యావసర వస్తువులు, స్వచ్ఛమైన తాగునీరు, వైద్య సేవలు తదితర సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని కోరారు.ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ,అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, వరద నీరు ప్రవహిస్తున్న ప్రాంతాలు, వాగులు, వంకలు దాటేందుకు ప్రయత్నించవద్దని, జిల్లా యంత్రాంగం జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.