navageetam.com
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 9:50 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ సూచించారు.వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం మరో నాలుగు రోజుల పాటు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా వాగులు, వంకలు, కల్వర్టులు, చెరువులు, నదుల వద్దకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్–100కు సమాచారం అందించి పోలీసు సేవలను వినియోగించుకోవాలని కోరారు.

పోలీసుల సూచనలు

👉 ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ దిగవద్దు.

👉 చేపల వేట కోసం చెరువులు, వాగులు, నదుల వద్దకు వెళ్లవద్దు.

👉 నీటితో మునిగిన కల్వర్టులు, వంతెనలు, వాగులను దాటే ప్రయత్నం చేయవద్దు.

👉 పశువులను మేతకు తీసుకెళ్లే వారు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి.

👉 విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలను ముట్టుకోవద్దు.

👉 వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు విద్యుత్ తీగలు, నీటి ప్రవాహాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

👉 శిథిలావస్థలో ఉన్న లేదా కూలిపోయే ప్రమాదం ఉన్న ఇళ్లలో నివసించవద్దు.

👉 అత్యవసరం కాని దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది.

👉 మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దు.

👉 వాహనాల్లో అనుమతించిన పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లవద్దు.

👉 సెల్ఫీలు, రీల్స్ కోసం వాగులు, చెరువులు, జలపాతాలు లేదా వరద నీటి ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకోవద్దు.