నవగీతం,కొడిమ్యాల
కొడిమ్యాల మండల కేంద్రంలోని సంద్రాలపల్లె కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను హైదరాబాద్ నుంచి వచ్చిన తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ బృందం ఆకస్మికంగా తనిఖీ చేసింది. ఈ తనిఖీలో కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, సభ్యులు వచన్ కుమార్, చందనా, అపర్ణ, సరిత తదితరులు పాల్గొన్నారు. సందర్శనలో భాగంగా పాఠశాల పరిసరాల పరిశుభ్రత, మరుగుదొడ్లు, స్టోర్రూమ్, వంటశాల, కూరగాయల నిల్వలు తదితర అంశాలను కమిషన్ బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి, వారి సమస్యలు, అవసరాలపై వివరంగా ఆరా తీసింది. విద్యార్థులకు బాలల హక్కులు, కమిషన్ అందిస్తున్న సేవలపై అవగాహన కల్పించారు. అలాగే పోక్సో చట్టం, చైల్డ్ హెల్ప్లైన్ నంబర్ల గురించి వివరించారు. పదో తరగతి అనంతరం తమ భవిష్యత్ లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ఇస్తూ ప్రోత్సహించారు. పాఠశాల వాతావరణం సంతృప్తికరంగా ఉందని కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాము, సెక్టోరియల్ ఆఫీసర్ మహేష్, మండల విద్యాధికారి శ్రీనివాస్, జిల్లా ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజ్కుమార్, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ హరీష్, సురేష్, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ లావణ్యతో పాటు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.