ఎమ్మెల్యే హామీతో ధర్నా విరమణ
నవగీతం,జగిత్యాల
జగిత్యాల జిల్లా కొండగట్టులోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఆంజనేయస్వామి ఆలయం ముందు అర్చకులు శాంతియుతంగా నిరసన చేపట్టారు. ఆలయ ఈవో తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ అర్చకులు ఆలయం ముందు బైఠాయించి తమ న్యాయసమ్మతమైన సమస్యలను తెలియజేశారు.అర్చకులు మాట్లాడుతూ, తమ సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సరైన స్పందన లేకపోవడంతోనే నిరసనకు దిగాల్సి వచ్చిందన్నారు.అర్చకుల హక్కులు, గౌరవం కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ ఆందోళన చేపట్టామని స్పష్టం చేశారు.ఈ క్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జోక్యం చేసుకుని అర్చకుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీపై విశ్వాసంతో, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో అర్చకులు ధర్నాను విరమించి తిరిగి విధుల్లోకి చేరారు.ధర్నా విరమణ అనంతరం ఆలయంలో దర్శన వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి చేరింది. భక్తులు స్వామివారి దర్శనం సజావుగా చేసుకోవడంతో పాటు, ఆలయ పరిసరాల్లో నెలకొన్న ఉద్రిక్తత తొలగినట్లు అధికారులు తెలిపారు.