navageetam.com
Newspaper Banner
Date of Publish : 16 January 2026, 2:01 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

గ్రామ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహణ

నవగీతం,మల్లాపూర్

మల్లాపూర్ మండలం కొత్త దాంరాజ్ పల్లి గ్రామంలో గ్రామ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌ను గ్రామ యువకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌కు గ్రామ నుంచి అనేక జట్లు పాల్గొని ఉత్సాహంగా పోటీపడ్డాయి. టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ ఎగ్యారపు లింబాద్రి, గ్రామ పంచాయతీ కార్యదర్శి వంశీధర్ రెడ్డి, యువ నాయకులు పాల్గొని క్రీడల ప్రాముఖ్యతను వివరించారు. యువత శారీరక దృఢత్వం, క్రీడాస్ఫూర్తి పెంపొందించుకోవడానికి ఇటువంటి టోర్నమెంట్‌లు ఎంతో ఉపయోగపడతాయని వారు పేర్కొన్నారు. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రిషి జట్టు విజయం సాధించి మొదటి బహుమతిని అందుకుంది. రెండో బహుమతిని అన్వర్ జట్టు కైవసం చేసుకుంది. విజేతలకు నిర్వాహకులు నగదు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. టోర్నమెంట్ విజయవంతంగా ముగియడంతో గ్రామంలో క్రీడల పట్ల ఆసక్తి మరింత పెరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎగ్యారపు లింబాద్రి, ఉపసర్పంచ్ బద్దం హరీష్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి వంశీధర్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బద్దం సుధాకర్, వార్డు మెంబర్ బద్దం రాంచందర్ రెడ్డి, గ్రామ యువకులు పాల్గొన్నారు