నవగీతం, జగిత్యాల
జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణలను రక్షించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1 నుండి 31 వరకు జాతీయ రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈసందర్భంగా రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను అధికారులతో కలిసి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లావ్యాప్తంగా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అవగాహన,వేగ నియంత్రణ, ట్రాఫిక్ సంకేతాల పాటింపు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి పాఠశాలలు, కళాశాలలు, ప్రధాన చౌరస్తాలు, బస్టాండ్లు తదితర ప్రజా రద్దీ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్యవంతులను చేయనున్నట్లు తెలిపారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి,రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, యం వి ఐ ప్రమీల,రవాణా శాఖ మెంబర్ శ్రీనివాస్, రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు