navageetam.com
Newspaper Banner
Date of Publish : 06 January 2026, 3:33 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

టిటిడిలో ఇంజనీరింగ్ పనులను వేగంగా పూర్తి చేయండి – టిటిడి ఛైర్మెన్  బీఆర్ నాయుడు

నవగీతం, తిరుపతి

టిటిడిలో జరుగుతున్న పలు ఇంజనీరింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు అధికారులకు సూచించారు. టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ తో కలసి ఆయన సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఛైర్మెన్  బీఆర్ నాయుడు మాట్లాడుతూ అమరావతి వేంకటపాలెంలో  ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు శ్రీ ఎస్వీ ఆలయ విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా టిటిడి కల్యాణ మండపాలపై ఒక కమిటీని ఏర్పాటు చేసి వారు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టాలని సూచించారు. 5 వేల భజన మందిరాలను, నిర్మాణంలో ఉన్న ఆలయాలను, ఇటీవల కాలంలో అనుమతులు పొందిన ఆలయాలను సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.ఉపమాకలోని శ్రీ ఎస్వీ ఆలయం, కరీంనగర్ లోని శ్రీ పద్మావతీ ఆండాళ్ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, అనంతవరం శ్రీ ఎస్వీ ఆలయం, కుప్పంలో నిర్మించనున్న 141 ఆలయాలు, నవీ ముంబైలోని శ్రీ ఎస్వీ ఆలయం, ముంబైలోని భాంద్రా, కర్నాటకలోని బెల్గావిలోని ఎస్వీ ఆలయం, కొండగట్టు అంజన్న ఆలయం పరిధిలో అభివృద్ధి పనులు, కాణిపాకంలోని పీఏసీ తదితర అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. అదేవిధంగా, ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయం సమీపంలో పలు అభివృద్ధి పనులు, 108 అడుగుల జాంబవంతుడు విగ్రహ ఏర్పాటు తదితర పనులతో పాటు టిటిడిలో జరుగుతున్న పనులను సకాలంలో, జరుగనున్న పనులకు పాలనాపరమైన అనుమతులు తీసుకుని పూర్తి చేయాలన్నారు. అలిపిరిలో భక్తుల సౌకర్యార్థం నిర్మించనున్న బేస్ క్యాంప్ కు డిజైన్ లను తయారు చేయాలన్నారు. అదేవిధంగా తిరుమల, తిరుపతిలో నిర్మాణంలో ఉ న్న ఇంజనీరింగ్ పనులను గడవులోపు పూర్తికి చర్యలు చేపట్టాలన్నారు.వచ్చే వేసవి సమయానికి భక్తులకు ఇబ్బంది లేకుండా వసతి సౌకర్యాం, క్యూలైన్లు, రహదారులు, తాగునీరు తదితర సౌకర్యాలపై ముందస్తుగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. నిర్మాణాలకు సంబంధించి ఏదైనా పాలనాపరమైన సమస్యలు తలెత్తితే పాలక మండలి దృష్టికి తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టిటిడి పాలకమండలి సభ్యులు  జి. భానుప్రకాష్ రెడ్డి, ఎం. శాంతారామ్. పనబాక లక్ష్మీ, ఎస్. నరేష్ కుమార్ పాల్గొనగా, నన్నపనేని సదాశివరావు వర్చువల్ ద్వారా, జేఈవో  వి. వీరబ్రహ్మం, ఎఫ్ఎ అండ్ ఎస్ఏవో  ఓ బాలాజీ, సీఈ టివి సత్యనారాయణ, ఎస్.ఈ మనోహరం, పలువురు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.