నవగీతం,హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ పరిధిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు తెలిపారు. కొండగట్టులో ఆలయ అభివృద్ధి పనులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ కొండగట్టులో ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టిటిడిని కోరడంతో, ఈ అంశాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామన్నారు. తదుపరి టిటిడి బోర్డు సమావేశంలో ఆలయ అభివృద్ధి పనులకు రూ. 35.19 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం టిటిడి నిధులతో 96 గదులతో కూడిన ధర్మశాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, కొండగట్టు ఆలయ అభివృద్ధి పనులకు రూ. 35.19 కోట్లు కేటాయించిన టిటిడి పాలక మండలి ఛైర్మెన్ బీఆర్ నాయుడు, పాలక మండలి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేయాలని టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడును కోరామని, సీఎం చంద్రబాబు సూచనలతో టిటిడి బోర్డు నిర్ణయం తీసుకోవడంపై అభినందనలు తెలియజేశారు.
అంతకుముందు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు చేరుకోగానే తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, అర్చకులు శాస్త్రోక్తంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనానంతరం తీర్థప్రసాదాలను అందించారు