ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
31 మంది అధికారులు, 266 మంది ఉద్యోగులకు శ్రీవారి వెండి డాలర్, ప్రశంసాపత్రం పంపిణీ
నవగీతం,తిరుపతి:
తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత గణతంత్ర వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్ మైదానంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు.ఈ సందర్భంగా టీటీడీ భద్రతా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. ఏవిఎస్వో శ్రీనివాసరావు పెరేడ్ కమాండర్గా వ్యవహరించారు. అనంతరం టీటీడీ ఈవో ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత విధుల్లో ఉత్తమ సేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన 31 మంది అధికారులు, 266 మంది ఉద్యోగులకు, ఎస్వీబీసీలో 7 మంది ఉద్యోగులకు 5 గ్రాముల శ్రీవారి వెండి డాలర్, ప్రశంసాపత్రం అందజేశారు.

సాంస్కృతిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థినులు “ బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం బహురూప దారునికి బ్రహ్మోత్సవ ”, “ ఆడరో పాడరో అప్సరో గణము…”, “సమరస భావన భారత సామ్రాజ్ ..” దేశభక్తి గీతాలకు చక్కటి నృత్యం ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డా వి.కృష్ణవేణి, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులు వి.రమేశ్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

ప్రత్యేక ఆకర్షణగా టిటిడి జాగిలాల ప్రదర్శన :
టీటీడీ నిఘా మరియు భద్రత విభాగం ఆధ్వర్యంలో జాగిలాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డాగ్ స్క్వాడ్ ఇన్చార్జి అప్పరావు ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది.విరాట్, బిందు, ఇందు, షైని,గిరి,రాణి, జోన్ బ్యూటీ అనే జాగిలాలు పాల్గొన్నాయి. ఇందులో గ్రూప్ డ్రిల్, పేలుడు పదార్థాలను, మాదకద్రవ్యాలను గుర్తించడం, సైలెంట్ డ్రిల్, వస్తువులను జాగ్రత్తగా కాపాడడం, పారిపోతున్న సంఘ విద్రోహులను గుర్తించి నిలువరించడం తదితర ప్రదర్శనలను జాగిలాలు ఇచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది విన్యాసాలు అగ్నిమాపక సిబ్బంది తమ విన్యాసాలతో అగ్ని ప్రమాదాలపై అవగాహన, ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా అప్రమత్తంగా ఉండాలి, తదితర అంశాలను వివరించారు. ఇందులో సాలిడ్, లిక్విడ్, గ్యాస్ నుండి వచ్చే ఫైర్ను ఎలా అదుపు చేయాలి, ఇంటిలో వంట చేస్తున్నప్పుడు సిలిండర్పై మంటలు వ్యాపిస్తే ఎలా అదుపు చేయాలి, అటవీ ప్రాంతాలలో మంటలను ఎలా ఆర్పాలి తదితర అంశాలను తమ విన్యాసాలతో అవగాహణ కల్పించారు. అనంతరం వీరు నీటితో త్రివర్ణ పతాకం గుర్తుతో నిర్వహించిన ప్రదర్శణ చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు జి. భాను ప్రకాష్ రెడ్డి, జెఈవోలు వి. వీరబ్రహ్మం, డా.ఏ. శరత్, సివిఎస్వో కె.వి.మురళీకృష్ణ, ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజి, సిఇ సత్యనారాయణ, ఇంఛార్జి డిఎల్వో సుబ్బానాయుడు, అదనపు సివిఎస్వో శివ కుమార్ రెడ్డి, డిఎఫ్వో శ్రీ డి. ఫణి కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.