నవగీతం, జగిత్యాల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు పర్యటన సందర్భంగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా 1200 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కొత్త సురేష్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన బందోబస్తు బ్రీఫింగ్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొని, సంబంధిత అధికారులు, పోలీస్ సిబ్బందికి పూర్తి వివరాలతో బ్రీఫింగ్ నిర్వహించారు. పర్యటన సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తును సెక్టార్ల గా విభజించి అదనపు ఎస్పి స్తాయి అధికారులను బాధ్యులుగా నియమించడం జరిగింది అని అన్నారు. ప్రతి అధికారి, సిబ్బంది తమకు కేటాయించిన విధులను అత్యంత అప్రమత్తతతో నిర్వర్తించాలని సూచించారు. పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్, వాహనాల రాకపోకలు, పార్కింగ్ ప్రదేశాలు, హెలిప్యాడ్ ప్రాంతాలు, కీలక కూడళ్ల వద్ద భద్రతా ఏర్పాట్ల గురించి జిల్లా ఎస్పీ సవివరంగా వివరించారు. ముఖ్యంగా ట్రాఫిక్ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పని చేయాలని ఆదేశించారు.వీఐపీ వెళ్ళే మార్గాల లో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయడంతో పాటు సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు.ప్రతి అధికారి బందోబస్తు కేటాయించిన ప్రాంతం పై పూర్తి అవగాహన చేయవలసినటువంటి డ్యూటీ గురించి పూర్తిగా తెలిసి ఉండాలని అన్నారు.ఏదైనా సందేహం ఉంటే సంబంధిత అధికారులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ప్రజలు, అభిమానులు పోలీసుల సూచనలు పాటిస్తూ సహకరించాలని, పర్యటనను సజావుగా నిర్వహించేందుకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.ఈ యొక్క కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ లు భీమ్ రావు, శ్రీనివాస్ , డిఎస్పీ లు వెంకటరమణ,రఘు చందర్, రాములు, ఇతర జిల్లా నుంచి వచ్చిన డిఎస్పీలు సి.ఐలు, ఎస్సైలు పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.