-బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షురాలు దాసరి ఉష
ఘనంగా గణతంత్ర వేడుకలు
నవగీతం,పెద్దపల్లి:
భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు,బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షురాలు దాసరి ఉష పెద్దపల్లి పద్మశాలి సంఘ భవనంతో పాటు,అమర్ నగర్ లోని పూలే విగ్రహం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మహనీయులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య పోరాటంలోనూ, ప్రగతిలోనూ చేనేత కార్మికుల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. 1930లో పూర్ణ స్వరాజ్ ప్రకటించుకున్న నాటి నుండి నేటి వరకు పద్మశాలీలు దేశానికి వెన్నుముకగా నిలిచారని గుర్తుచేశారు.బ్రిటిష్ వస్త్రాలను బహిష్కరించి,స్వదేశీ చేనేత వస్త్రాలనే ధరించి ఉద్యమించడంలో మన సోదరులు చూపిన సాహసం చరిత్రలో నిలిచిపోతుందని ఆమె పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమకారుడు,ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఉష పిలుపునిచ్చారు.

ఈ క్రమంలోనే వచ్చే ఫిబ్రవరి 16న బాపూజీ విగ్రహం జిల్లాకు రాబోతున్నట్లు ఆమె వెల్లడించారు. విగ్రహ ప్రతిష్టాపన కోసం త్వరలోనే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి,అనువైన స్థలాన్ని ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు.పద్మశాలీలందరూ ఐక్యమత్యంతో ఉండి రాజకీయ, సామాజిక రంగాల్లో రాణించాలని ఆమె ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి శంకర్, వైస్ ప్రెసిడెంట్ కొండి సతీష్,మహిళా కన్వీనర్ సిరవేన స్వప్ప,మండల కన్వీనర్లు రాజేందర్,సలేంద్ర కొమురయ్య, రమేష్,మాలిక్,రాజుకుమార్,పద్మశాలి సంఘం నేతలు ఆడెపు సుధాకర్,శ్రీనివాస్, రవి, లక్ష్మినారాయణ, ధనంజయ, భూమేష్, అలువాల రాజేందర్ తోపాటు పలువురు బీసీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.