నవగీతం,మల్లాపూర్
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం నడికుడ గ్రామంలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నడికుడ సర్పంచ్ తూర్పు సమత రాజన్న స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ముద్దం శేఖర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద అని కొనియాడారు. భారతీయ సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను పాశ్చాత్య దేశాలకు పరిచయం చేసిన గొప్ప వ్యక్తిగా ఆయన నిలిచారని తెలిపారు. తన గురువు రామకృష్ణ పరమహంస పేరుతో రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠాలను స్థాపించి అనేకమంది యువతను విద్య మరియు సమాజసేవల వైపు ప్రేరేపించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ముద్దం రాజేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మీసాల లక్ష్మీ దేవన్న, ముద్దం రాజశేఖర్ రెడ్డి, రేగుంట సాయి చందర్, నన్నాపు వెంకటరమణ రాజు, కోరి పెళ్లి శ్రీధర్ రెడ్డి, రత్నపురం గంగారం తదితరులు పాల్గొన్నారు.