navageetam.com
Newspaper Banner
Date of Publish : 25 January 2026, 4:04 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ప్రశాంతంగా రంజాన్ మాసం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి.

అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి

ప్రతి మస్జిద్, ఈద్గాల వద్ద పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ

నవగీతం, ఖమ్మం :

ప్రశాంతంగా రంజాన్ మాసం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. అదనపు కలెక్టర్, కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రంజాన్ మాసం ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ముస్లిం ప్రతినిధులతో సమీక్షించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం ప్రశాంతంగా జరుపుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీలలో సైతం అవసరమైన ఏర్పాట్ల కోసం అధికారులకు సూచనలు జారీ చేశామని అన్నారు.రంజాన్ మాసం సందర్భంగా మసీదుల వద్ద ఎక్కడైనా డ్రైయినేజి, అప్రోచ్ రోడ్డు గుంతల మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టాలని అన్నారు. మసీదుల వద్ద హైమాస్ లైట్, వీధి దీపాల పని తీరు పర్యవేక్షించాలని, మసీదుల వద్ద పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని అన్నారు.మసీదుల వద్ద వీధి కుక్కల బెడద ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. మసీదు పరిసరాల ప్రాంతాల్లో కుక్కలకు, కోతులకు ఎట్టి పరిస్థితుల్లో ఆహారం పెట్టవద్దని అదనపు కలెక్టర్ తెలిపారు.ప్రతి మసీదు వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వైద్య ఆరోగ్యశాఖ అధికారికి సూచించారు. షాపులు 24 గంటలు నడిపేందుకు గల అవకాశాలను పరిశీలించి పోలీసు శాఖ సూచనలు అందిస్తుందని అన్నారు. నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండాలని, మసీదులకు అవసరమైన మేర త్రాగునీటి సరఫరాను అందిస్తామని అన్నారు. ప్రతి మసీదు దగ్గర పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, ఏదైనా మస్జిద్ దగ్గర త్రాగు నీటి సరఫరా, విద్యుత్ సరఫరా సంబంధించి ఏదైనా పనులు ఉంటే వెంటనే తెలియజేయాలని ముఖ్యంగా ఈద్గాలు, కబ్రస్తాన్ లలో పిచ్చి మొక్కలు తొలగించాలని పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచాలని అదనపు కలెక్టర్ తెలిపారు.గ్రామ పంచాయతీలలో ఉన్న మస్జిద్ జాబితా తయారు చేసి రెగ్యులర్ గా అక్కడ పారిశుద్ధ్య పనులు జరిగేలా పంచాయతీ అధికారి చర్యలు తీసుకోవాలని అన్నారు.ప్రతి మస్జిద్ వద్ద నిరంతరం విద్యుత్ సరఫరా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు పండగ సందర్భంగా షాపింగ్ కోసం మార్కెట్ వద్ద పెద్ద ఎత్తున మహిళలు వచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన భద్రత ఏర్పాట్లు చేయాలని, ప్రతి మసీదు వద్ద పార్కింగ్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి మస్జిద్ పరిసరాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. అనంతరం ప్రతి మసీదు వద్ద చేయాల్సిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ముస్లిం ప్రతినిధులతో అదనపు కలెక్టర్ చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మహమ్మద్ ముజాహిద్, జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్, కలెక్టరేట్ ఏవో కె. శ్రీనివాసరావు, పోలీస్ సిఐ రామకృష్ణ, వివిధ శాఖల అధికారులు, ముస్లిం మత పెద్దలు, మస్జిద్ కమిటీ సదర్లు ప్రెసిడెంటు , సెక్రటరీ, మైనారిటీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.