navageetam.com
Newspaper Banner
Date of Publish : 21 January 2026, 12:13 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మార్కండేయుని ధర్మనిష్ట యువతకు స్ఫూర్తిదాయకం

బీసీ జేఏసీ చైర్‌ పర్సన్‌ దాసరి ఉష

ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు

నవగీతం,పెద్దపల్లి:

మృత్యువును జయించిన చిరంజీవి,భక్త మార్కండేయ మహర్షి ఆశీస్సులు సమాజంపై ఎల్లప్పుడూ ఉండాలని బీసీ జేఏసీ చైర్‌ పర్సన్‌ దాసరి ఉష ఆకాంక్షించారు.బుధవారం జిల్లా కేంద్రంలోని పద్మశాలీ భవనంలో మార్కండేయ జయంతి వేడుకలను పద్మశాలీ సంఘం పట్టణ అధ్యక్షులు బత్తుల రమేష్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో భాగంగా పద్మశాలీ భవనంలో ప్రత్యేక హోమం,పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన దాసరి ఉష స్వామివారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్కండేయ జయంతి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజని కొనియాడారు. స్వల్ప ఆయుష్షు అని తెలిసినా భయపడకుండా, అచంచలమైన శివభక్తితో మార్కండేయుడు మృత్యువును సైతం గెలిచి చిరంజీవిగా నిలిచారని గుర్తుచేశారు.నేటి యువత మార్కండేయ మహర్షి జీవితం నుండి ఆత్మవిశ్వాసాన్ని, ధర్మనిష్టను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పండుగ కేవలం ఒక వేడుక మాత్రమే కాదని,మానవ జీవనానికి సరైన మార్గాన్ని చూపే అద్భుత ఆధ్యాత్మిక సందేశమని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పద్మశాలీ సంఘం నేతలు,ప్రతినిధులు కొండి సతీష్,ఆడెపు సుధాకర్,లక్ష్మీ, ధనుంజయ్,శ్రీనివాస్,అరుణతో పాటు పట్టణ పద్మశాలీలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.