నవగీతం, కొడిమ్యాల
కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలోని శ్రీ శివభక్త మార్కండేయ, శ్రీ ఆంజనేయ, శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ సన్నిధానంలో శ్రీ శివభక్త మార్కండేయ స్వామి జయంతి. శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఉదయం 7.45 గంటలకు ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8.05 గంటలకు శ్రీ శివభక్త మార్కండేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి శత కుంభాభిషేకం శాస్త్రోక్తంగా జరిపారు. మధ్యాహ్నం 12.05 గంటలకు శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, ఓడిబియ్యం కార్యక్రమాలను మహిళా భక్తులు భక్తిభావంతో నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం మహా అన్నవితరణ కార్యక్రమం నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం 3.00 గంటలకు ఉత్సవ మూర్తుల శోభాయాత్రను ఘనంగా నిర్వహించగా, మహిళా భక్తులచే మంగళ హారతులు, కోలాట నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ దైవీయ కార్యక్రమాలలో పాల్గొన్న భక్తజనులు స్వామివారి కృపకు పాత్రులయ్యారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.