navageetam.com
Newspaper Banner
Date of Publish : 11 January 2026, 2:57 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మెట్‌పల్లి చైనా మాంజా కేసులో పురోగతి: నిర్మల్‌లో ప్రధాన సరఫరాదారు అరెస్ట్

నవగీతం మెట్ పల్లి

మెట్‌పల్లి పట్టణంలో నాలుగేళ్ల బాలుడు శ్రీహన్ మెడకు చైనా మాంజా చుట్టుకొని తీవ్రంగా గాయపడిన ఘటనలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే స్థానిక విక్రేత షేక్ సిద్ధిక్ హుస్సేన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతనిచ్చిన సమాచారం మేరకు ఈ ప్రమాదానికి కారకమైన నిషేధిత మాంజాను సరఫరా చేస్తున్న ప్రధాన నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేశారు. స్థానిక విక్రేత సిద్ధిక్ హుస్సేన్ విచారణలో భాగంగా తాను గత కొంతకాలంగా నిర్మల్ పట్టణానికి చెందిన ఎం.డి. ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి వద్ద నుండి ఈ నిషేధిత చైనా మాంజాను కొనుగోలు చేస్తున్నట్లు అంగీకరించాడు. ఈ సమాచారం ఆధారంగా మెట్‌పల్లి ఎస్సై పి. కిరణ్ కుమార్ తన సిబ్బందితో కలిసి ఆదివారం నిర్మల్ పట్టణంలో మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో ప్రధాన నిందితుడు ఫిరోజ్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నిల్వ ఉంచిన భారీ మొత్తంలో నిషేధిత చైనా మాంజా రీళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లాభాపేక్షతో నిబంధనలకు విరుద్ధంగా ప్రాణాంతకమైన మాంజాలను విక్రయిస్తున్నందుకు అతనిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై కిరణ్ కుమార్ మాట్లాడుతూ కేవలం కొద్దిపాటి లాభం కోసం అమాయక ప్రజల,పక్షుల ప్రాణాలతో చెలగాటం ఆడే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు.చైనామాంజా విక్రయించే వారే కాకుండా,వాటిని సరఫరా చేసే మూలాల వరకు వెళ్లి కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు పండుగను సురక్షితంగా జరుపుకోవాలి. నిషేధిత వస్తువులకు దూరంగా ఉండాలి అని విజ్ఞప్తి చేశారు.