navageetam.com
Newspaper Banner
Date of Publish : 31 January 2026, 3:45 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

యాభై మంది గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. 2.5 కోట్ల ఎక్స్ గ్రేషియా మంజూరు

ప్రభుత్వం వరమిచ్చినా.. అధికారుల అలసత్వంతో జాప్యం 

నవగీతం,హైదరాబాద్:

జగిత్యాల జిల్లాకు చెందిన 50 మంది గల్ఫ్ మృతుల కుటుంబాలు, రూ.5 లక్షల చొప్పున గల్ఫ్ ఎక్స్ గ్రేషియా ఆర్థిక సహాయానికి అర్హులని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వానికి పలు దఫాలుగా నివేదికలు పంపారు. పాస్‌పోర్టు, మరణ ధృవీకరణ పత్రం, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ, బ్యాంక్ ఖాతా వంటి పత్రాల సేకరణను మండల తహసీల్దార్ ల ద్వారా వేగంగా పూర్తి చేయించి, దరఖాస్తుల పరిశీలనను సమర్థవంతంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్‌ను పలువురు అభినందిస్తున్నారు. కోరుట్ల నియోజకవర్గంలో 19, ధర్మపురి నియోజకవర్గంలో 14, జగిత్యాల నియోజకవర్గంలో 7, వేములవాడ నియోజకవర్గంలో 6, చొప్పదండి నియోజకవర్గంలో 4 కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా మంజూరు అయ్యింది. మొత్తం 50 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున రూ. 2.5 కోట్ల నిధులు విడుదల చేయాల్సి ఉందని తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి తెలిపారు. అయితే నిధులు సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర సచివాలయంలోని జీఏడి ఎన్నారై విభాగం అధికారుల అలసత్వం కారణంగా గల్ఫ్ మృతుల కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లో డబ్బు జమ కావడం లేదని సమాచారం. ఈ విషయంలో జిల్లాకు చెందిన మంత్రి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు జోక్యం చేసుకుని వెంటనే నిధులు విడుదల చేయించాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.