navageetam.com
Newspaper Banner
Date of Publish : 06 January 2026, 10:32 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

తంగళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

నవగీతం,తంగళ్ళపల్లి,

వైద్యారోగ్య శాఖ సిబ్బంది క్షేత్ర స్థాయిలో ప్రజలకు అన్ని వ్యాధులపై అవగాహన కల్పించాలని, ఏ.ఎన్.సీ రిజిస్ట్రేషన్లు, ఎన్.సీ.డీ స్క్రీనింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీ.హెచ్.సీ)ని ఇంచార్జి కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో ఓపీ రిజిస్టర్, ల్యాబ్, ఇమ్యూనైజేషన్ గది, ఇన్ పేషెంట్ గదులు,ఇతర గదులు, ఆవరణలో పరిశీలించారు.ఆరోగ్య కేంద్రంలో ఉన్న ఏ.ఎన్.ఎం. లతో మాట్లాడి క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, ఏ.ఎన్.సీ రిజిస్ట్రేషన్లు, గర్భిణీల ఆరోగ్య విషయాలపై దృష్టి సారించి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచే విధంగా కృషి చేయాలని సూచించారు.ఎన్.సీ.డీ స్క్రీనింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. దీని ద్వారా ముందు గానే వ్యాధి లక్షణాలను గుర్తించి, అవసరమైన చికిత్స అందించడానికి ఆస్కారం ఉంటుందని అన్నారు. రిజిస్టర్ లు అన్ని సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రతపై వివరించాలని తెలిపారు. ప్రసవాల సంఖ్యపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణం, పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని వైద్యాధికారికి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.