వయోవృద్ధుల సదన్ ప్రారంభించిన ప్రముఖులు
నవగీతం, జగిత్యాల
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వయోవృద్ధుల సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా, స్థానిక టి.ఆర్ నగర్లో 1.25 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ వయోవృద్ధుల సదనాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు, వికలాంగులు, ట్రాన్స్ జెండర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ లతో కలిసి ఘనంగా ప్రారంభించారు.

బైపాస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రణం డే కేర్ సెంటర్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ వయోవృద్ధుల హక్కులను, బాధ్యతలను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యం. వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సదనం, ప్రణం డే కేర్ సెంటర్ను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. కన్న తల్లిదండ్రులను విస్మరించే లేదా నిర్లక్ష్యం చేసే పిల్లలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. వృద్ధాశ్రమానికి ప్రహరీ గోడ నిర్మాణం కోసం రూ. 30 లక్షలు మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే కోరగా, సానుకూలంగా స్పందిస్తూ నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ మాట్లాడుతూ టి.ఆర్ నగర్లో అత్యాధునిక వసతులతో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమని అన్నారు. వయోవృద్ధులు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.