జిల్లా పరిషత్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ
నవగీతం,జగిత్యాల
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్ పూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో బోధన విధానం, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం అమలు, మౌలిక వసతులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. తరగతి గదిలో విద్యార్థుల పాఠ్యంశాల్లోని సిలబస్ ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ముఖాముఖి సంభాషణ జరిపి వారితో పాఠాలు చదివించి వారి భోదన స్థితి గతులను ప్రత్యేకంగా పరిశీలించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో మరియు ఇతర నైపుణ్యాల్లో కూడా రాణించాలని సూచించారు. అదేవిధంగా 26వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన ఆటల పోటీల్లో జిల్లా కలెక్టర్ విద్యార్థులతో పాటు స్వయంగా పాల్గొని వారిని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డిఓ జివాకర్ రెడ్డి, జిల్లా విద్యాధికారి కె. రాము మండల తహసిల్దార్, ఎంఈఓ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.