navageetam.com
Newspaper Banner
Date of Publish : 23 January 2026, 1:43 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

వైభవంగా వసంత పంచమి వేడుకలు

పదవ తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

నవగీతం,కొడిమ్యాల

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.అలాగే ప్రభుత్వ జిల్లా ఉన్నత బాలికల పాఠశాల ప్రాంగణంలో 1983–84 బ్యాచ్ పూర్వ విద్యార్థులు నిర్మించిన సరస్వతి ధ్యాన మందిరంలో వసంత పంచమి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చదువుల తల్లి శ్రీ సరస్వతి దేవికి పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినులతో కలిసి పంచామృతాభిషేకం, పుష్పార్చన, కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.పూజా కార్యక్రమాల అనంతరం పూర్వ విద్యార్థులు తమ సేవాభావాన్ని చాటుతూ పదవ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలకు ఉపయోగపడే విధంగా పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. తాము చదువుకున్న పాఠశాల పట్ల గౌరవంతో ప్రతి ఏటా వసంత పంచమి రోజున ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని స్థానికులు కొనియాడారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి, ఉప సర్పంచ్ గుర్రం నరసయ్య గౌడ్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ విజయేంద్ర, ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.