navageetam.com
Newspaper Banner
Date of Publish : 09 January 2026, 8:44 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

సన్నధాన్యం రకాలు, వాటి సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలి.జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

నవగీతం, జగిత్యాల

సన్నధాన్యం సాగు ద్వారా రైతులకు ప్రభుత్వ బోనస్ కాకుండా మంచి నాణ్యతతో పాటు మెరుగైన మార్కెట్ ధరలు పొందే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు.కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్, అదనపు కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా సహకార అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి, జిల్లా పౌర సరఫరాల అధికారి, టీజీ సీడ్స్ డీఎం, ఆర్‌ఎం, పొలాస శాస్త్రవేత్తలు, వివిధ విత్తన ప్లాంట్ల ప్రతినిధులు విత్తన పంపిణీదారులు పాల్గొన్నారు. రాబోయే ఖరీఫ్‌ 2026–27 సాగు సీజన్‌లో జగిత్యాల జిల్లాలో సన్న ధాన్యం మరియు ఇతర పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచడంపై విస్తృతంగా చర్చించారు. రైతులు రోహిణి కార్తె (మే 25) నుంచి జూన్15 లోపు KNM-1638, BPT-5204, RNR-15048, JGL-27356, JGL-11470 వంటి సన్న రకాల్ని సాగు చేయడం వల్ల చీడపీడల ఉదృతి తగ్గి, అధిక దిగుబడులు సాధించవచ్చని సమావేశంలో వివరించారు.సన్న ధాన్యం సాగు ద్వారా రైతులకు ప్రభుత్వ బోనస్ లభించడమే కాకుండా, మంచి నాణ్యతతో పాటు మెరుగైన మార్కెట్ ధరలు పొందే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అదనంగా,సన్న రకాలతో పాటు పప్పులు, మొక్కజొన్న, పసుపు, కూరగాయ, సోయాబీన్ వంటి ఇతర పంటలను కూడా సాగు చేయడం ద్వారా రైతులు పంటల వైవిధ్యం సాధించి, భూసారాన్ని కాపాడుకోవడంతో పాటు అదనపు ఆదాయాన్ని పొందగలరని సూచించారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు విత్తన పంపిణీదారులు, డీలర్లు, రైతులకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పొలాస శాస్త్రవేత్తలు సన్న ధాన్యం రకాలు, వాటి సాగు పద్ధతులు, దిగుబడి సామర్థ్యం గురించి వివరించడంతో పాటు, ఇతర పంటలతో కలిపి సాగు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా వివరించారు. విత్తనాల సరఫరా, పంపిణీ, నిల్వలు మరియు అవగాహన కార్యక్రమాల నిర్వహణలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతులకు సరైన సమయంలో నాణ్యమైన విత్తనాలు అందించి, సన్న ధాన్యం సాగుపై విస్తృత ప్రచారం చేపట్టి, ఇతర పంటలతో కలిపి సాగు చేయడం ద్వారా జిల్లాలో సన్న రకం విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచి, రైతుల ఆదాయాన్ని మరింతగా పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.