చిత్తూరు,మధురై మామిడి మార్కెట్ను పరిశీలించిన పెద్దపల్లి మార్కెట్ కమిటీ సభ్యులు
అత్యాధునిక విధానాలపై అధ్యయనం
నవగీతం,పెద్దపల్లి:
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఇతర ప్రాంతాల్లోని మార్కెటింగ్ విధానాలను,అత్యాధునిక సౌకర్యాలను అధ్యయనం చేయడానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టింది.

ఈ పర్యటనలో భాగంగా బృందం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు మామిడి మార్కెట్ను మరియు తమిళనాడులోని మధురై స్మార్ట్ ఫ్రూట్ మార్కెట్ను సందర్శించింది.మొదటగా చిత్తూరులోని వ్యవసాయ మార్కెట్ ను సందర్శించిన పాలకవర్గ సభ్యులు,అక్కడ మామిడి క్రయవిక్రయాలు జరిగే తీరును అడిగి తెలుసుకున్నారు. ఆసియాలోనే అతిపెద్ద మామిడి మార్కెట్లలో ఒకటిగా పేరొందిన చిత్తూరులో రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు,పల్పింగ్ పరిశ్రమలతో ఉన్న అనుసంధానంపై అక్కడి అధికారులతో చర్చించారు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ అధికారులకు వినతి పత్రం అందజేసి,అక్కడి పనితీరును ప్రశంసించారు.అనంతరం తమిళనాడులోని మధురై స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన స్మార్ట్ ఫ్రూట్ మార్కెట్ను బృందం పరిశీలించింది.మధురై కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ మార్కెట్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత మరియు క్రమబద్ధీకరించిన విక్రయ విధానాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు.పెద్దపల్లి మార్కెట్ పరిధిలోని రైతులకు మరింత మెరుగైన సేవలందించడానికి,ఇతర రాష్ట్రాల్లోని ఉత్తమ విధానాలను మన దగ్గర కూడా అమలు చేసేందుకు ఈ అధ్యయన పర్యటన దోహదపడుతుందని పాలకవర్గ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కూర మల్లారెడ్డి,పాలకవర్గ సభ్యులు కొమ్ము కర్ణాకర్,కోలూరి చందు,కనకయ్య, రాజేశం, శ్రీనివాస్, చంద్రయ్య,కనకయ్య, గౌస్, సతీష్ మరియు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.