నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలోని నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా చేయాలని అధికారులకు ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ…మంజూరైనా ఇందిరమ్మ ఇండ్లను పూర్తిస్థాయిలో గ్రౌండింగ్ చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం నిర్మించుకునే ప్రతి ఇంటికి తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు అందజేస్తుందని తెలిపారు. ఇటుక, కంకర, బేస్మెంట్ పై ధరల నియంత్రణ ఇండ్లు లబ్ధిదారులకు ధరలు అనుగుణంగా ఉండేలా అధికారులను కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వెనుకబడి ఉన్నట్లయితే వేగవంతం పెంచాలని అధికారులకు ఆదేశించారు. గడువులోపు వారికి కేటాయించిన టార్గెట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ భవనాలు ప్రభుత్వం నిర్దేశించిన పరిణామం కలిగి ఉండాలని లబ్ధిదారులకు మరియు నిర్మాణాన్ని సకాలంలో నిర్మించుకునేందుకు కావాల్సిన మేస్త్రీలు, కార్మికులను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఆర్థిక పరమైన సమస్యలుంటే ఐకేపి సహకార సంఘాల ద్వారా రుణాలు పొందాలని అన్నారు. దశలవారిగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిల్లులు చెల్లింపు నేరుగా ఆధార్ లింక్ చేయబడిన లబ్ధిదారుడి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం పలు మార్కింగ్, బెస్మెంట్, స్లాబ్ లెవెల్ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి ఇళ్ల లబ్ధిదారులతో నేరుగా మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేసి గృహప్రవేశం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి, తహసీల్దార్, ఎంపిడివో, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.