navageetam.com
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 11:23 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఎస్జీటీ పోస్టుల రద్దును వెంటనే విరమించుకోవాలి

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జీటీ సెకండరీ గ్రేడ్ టీచర్స్ పోస్టులను రద్దు చేయాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం టీజీయూఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు, ప్రధాన కార్యదర్శి జరుపుల గోవిందులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రాథమిక విద్యే విద్యా వ్యవస్థకు పునాది అని, అలాంటి కీలక స్థాయిలో ఉపాధ్యాయ పోస్టులను తగ్గించడం వల్ల ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. ఎస్జీటీ పోస్టులు లేకుండా నాణ్యమైన విద్య బోధన సాధ్యం కాదని, ఫలితంగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగాలంటే తగిన సంఖ్యలో ఎస్జీటీ ఉపాధ్యాయులను నియమించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఒక్కో ఉపాధ్యాయుడిపై అధిక భారం పడటం వల్ల బోధనా ప్రమాణాలు తగ్గే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యను ప్రైవేటీకరణ వైపు నెట్టే విధానాలను విడిచిపెట్టి, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్జీటీ పోస్టుల రద్దు ప్రతిపాదనను కొనసాగిస్తే ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.