navageetam.com
Newspaper Banner
Date of Publish : 13 February 2026, 10:27 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఒంటరి పోరాటంతో అఖండ విజయం

పెద్దపల్లిలో హాట్ టాపిక్‌గా మారిన వెన్నం సుజాత-రవీందర్ గెలుపు

నవగీతం, పెద్దపల్లి:

పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి వెన్నం సుజాత- రవీందర్ అద్భుత విజయాన్ని అందుకున్నారు.గతంలో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడినప్పటికీ, మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈసారి 6వ వార్డు నుండి తన సతీమణిని బరిలోకి దింపిన బీఆర్ఎస్ నాయకుడు వెన్నం రవీందర్,తన రాజకీయ చాతుర్యాన్ని చాటుకున్నారు. చిత్రమేమిటంటే, ప్రచార పర్వంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమతా రెడ్డి వంటి అగ్రనేతలు ఎవరూ మద్దతుగా ప్రచారానికి రాకపోయినప్పటికీ, ఆయన వెనకడుగు వేయలేదు.అన్ని తానే అయి వార్డులోని ప్రతి గడపను తట్టి,ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని హామీ ఇస్తూ వారి ఆప్యాయతను గెలుచుకున్నారు. పార్టీ శ్రేణుల సహకారం నామమాత్రంగా ఉన్నా,కేవలం ప్రజాబలంతోనే బీఆర్ఎస్ పార్టీకి జిల్లా కేంద్రంలో ఒకే ఒక్క సీటును కైవసం చేసి పెట్టిన ఏకైక నాయకుడిగా రవీందర్ రికార్డు సృష్టించారు.ఈ గెలుపు పెద్దపల్లి రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు దారితీయడమే కాకుండా, నాయకత్వ పటిమ ఉంటే ఒంటరి పోరాటంతోనూ విజయం సాధించవచ్చని వెన్నం సుజాత-రవీందర్ నిరూపించారు. విజయం సాధించిన అనంతరం కూడా ఎటువంటి ఆర్భాటాలకు పోకుండా, వెన్నం సుజాత-రవీందర్ 6వ వార్డులోని ప్రతి ఇంటికి స్వయంగా వెళ్లి తన గెలుపుకు కారకులైన ఓటర్లను కలుస్తూ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. పార్టీ అండదండలు ఆశించిన స్థాయిలో లేకపోయినా, ప్రజాబలంతో ఒంటరిగా పోరాడి గెలిచిన వీరి తీరు స్థానికంగా అందరినీ ఆకర్షిస్తోంది.