నవగీతం,జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలంలోని ప్రసిద్ధ ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో సోమవారం సినీ హీరో అర్జున్ సర్జాకుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ, అర్చక బృందం ఆయనకు శాలువా కప్పి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా హీరో అర్జున్ మాట్లాడుతూ..ఎంతో ప్రసిద్ధి చెందిన కొండగట్టు అంజన్నను దర్శించుకోవాలని చాలా కాలంగా అనుకుంటున్నానని,నేడు స్వామివారి దర్శనం లభించడం తనకు అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.

స్వామివారి ఆశీస్సులతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న కోతులకు అరటి పండ్లు ఆహారంగా అందించారు. హీరో అర్జున్ రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. భక్తులు ఆయనతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు.అనంతరం అర్జున్ కూతురు ఐశ్వర్య సార్జ నటించిన సీతా పయనం చలనచిత్రం ప్రమోషన్ కోసం జగిత్యాల శ్రీనివాస థియేటర్ కు బయలుదేరి వెళ్లారు.
