అనుదీప్ దురిశెట్టి
నవగీతం,ఖమ్మం
ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం యువికెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వస్త్ మహిళ స్వస్థ్ భారత్ అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి లతో కలిసి పాల్గొన్నారు. క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తించడం చాలా కీలకమని, ప్రాథమిక దశ దాటితే ఆరోగ్య పరిస్థితి విషమం అవుతుందని, ప్రారంభ దశలో క్యాన్సర్ ను గుర్తిస్తే చికిత్స విజయవంతంగా పూర్తి చేసుకొని మెరుగైన జీవనం పొందవచ్చని కలెక్టర్ వివరించారు.

జిల్లాకు బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ యంత్రాలను అందించిన యువికెన్ ఫౌండేషన్ కు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ యంత్రాల ద్వారా ఆరోగ్య మహిళ శిబిరాలలో మహిళలను స్క్రీన్ చేసి అనుమానితులుగా ఉన్న వారికి అవసరమైన నిర్ధారణ పరీక్షలు నిర్వహించి క్యాన్సర్ వ్యాధిని గుర్తించిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలని, కలెక్టరేట్ లో 30 సంవత్సరాలకు పైగా వయస్సు ఉన్న ప్రభుత్వ మహిళ అధికారులు, ఉద్యోగులకు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసేందుకు క్యాంప్ ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారులను కలెక్టర్ ఆదేశించారు.