వినతి పత్రం అందజేసిన గల్ఫ్ సంఘ ప్రతినిధి
నవగీతం,మల్లాపూర్:
మల్లాపూర్ మండలం వేంపల్లి, వెంకట్రావుపేట్ గ్రామల నుంచి గల్ఫ్ దేశాల్లో ఉపాధి నిమిత్తం వెళ్లిన కార్మికుల కుటుంబాలకు సాగు భూములపై పట్టాలు మంజూరు చేయాలని గల్ఫ్ సంఘం అధ్యక్షుడు పెనుకుల అశోక్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుమారు 40 నుంచి 50 సంవత్సరాలుగా సాగు చేస్తున్న ప్పటికీ భూ సమస్యల కారణంగా ఇప్పటివరకు వారికి పట్టాలు మంజూరు కాలేదన్నారు. ప్రత్యేకించి సర్వే నంబర్లు 65,389,370,386 తదితర భూములు పూర్వీకుల కాలం నుంచే సాగులో ఉన్నాయని, అయినప్పటికీ అధికారిక పట్టాలు లేకపోవడం వల్ల కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు ఈ భూములను పరిశీలించి అర్హులైన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు వెంటనే పట్టాలు మంజూరు చేసి న్యాయం చేయాలని ఆయన తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.