navageetam.com
Newspaper Banner
Date of Publish : 15 February 2026, 7:29 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

గ్రామశివారులో 600 ఏళ్ల పురాతన శివలింగం

శివరాత్రి పండగ ప్రత్యేక పూజలు

నవగీతం,కొడిమ్యాల

కోడిమ్యాల మండలం రామకిష్టాపురం గ్రామ శివారులోని ప్రశాంతమైన మామిడి తోటలో కొలువై ఉన్న 600 ఏళ్ల నాటి పురాతన శివలింగం భక్తులకు అపారమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తోంది.ప్రకృతి ఒడిలో నిశ్శబ్దంగా వెలసిన ఈ దివ్య స్థలం భక్తి, చరిత్ర, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది.స్థానిక పెద్దల వాక్యానుసారం, ఈ శివలింగం సుమారు ఆరు శతాబ్దాల క్రితం నాటిదని విశ్వసిస్తున్నారు.పూర్వంలో ఇక్కడ ఒక పురాతన ఆలయం ఉండేదని, కాలక్రమేణా అది కనుమరుగైందని చెబుతున్నారు.ప్రస్తుతం ప్రకృతి సోయగాల మధ్య వెలసిన ఈ శివలింగాన్ని దర్శించగానే భక్తుల హృదయాల్లో భక్తి భావం మేల్కొంటోంది.ఈ క్షేత్రంలో భక్తితో పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని, కష్టాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తున్నారు.అందువల్ల సమీప గ్రామాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు.ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ అత్యంత ఘనంగా వేడుకలు నిర్వహించబడుతున్నాయి.అర్చకులు నాగరాజు శ్రీనివాస్, నాగరాజు రమేష్ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా అభిషేకాలు, అర్చనలు జరుగుతున్నాయి.శివరాత్రి సందర్భంగా భక్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ శివనామస్మరణతో ప్రాంతమంతా మారుమోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ శివలింగం బహిరంగ ప్రదేశంలో ఉండటంతో, దీనికి శాశ్వత ఆలయ నిర్మాణం చేపట్టాలని భక్తులు, గ్రామస్థులు కోరుతున్నారు. ప్రజాప్రతినిధులు, దాతలు, సేవాభావం కలిగిన భక్తులు ముందుకు వచ్చి ఈ చారిత్రక క్షేత్ర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ శివలింగం రామకిష్టాపురం గ్రామానికి రక్షణ కవచంలా భావించబడుతోంది. భక్తిశ్రద్ధలతో జరిగిన శివరాత్రి వేడుకలు గ్రామంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపి, భక్తుల మనసుల్లో దివ్యానుభూతిని కలిగించాయి.