నవగీతం,కొడిమ్యాల:
జగిత్యాల జిల్లా లోని టీఎస్ యూటీఎఫ్ బృందం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీకి బయలుదేరింది. ‘చలో పార్లమెంట్’ కార్యక్రమంలో భాగంగా ఈ బృందం కేంద్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకు పలు డిమాండ్లను ముందుంచింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని, ఓల్డ్ పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని, జాతీయ విద్యా విధానం–2020ను పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు. అలాగే పాఠశాలల విలీనాన్ని నిలిపివేయాలని, దేశవ్యాప్తంగా అవసరమైన 10 లక్షల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, బోధనేతర పనులను ఉపాధ్యాయులపై మోపకూడదని కోరారు. ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని కూడా వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తిరుకోవెల శ్యామ్ సుందర్, ప్రధాన కార్యదర్శి అంబటి భూమేశ్వర్, కోశాధికారి ఓజ్జ శ్రీనివాస్, ఓటు కన్వీనర్ వేముల శ్రీనివాస్, మోలుగురి నరేష్, నిశని మహేందర్, బబ్బురి రాజేందర్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.