navageetam.com
Newspaper Banner
Date of Publish : 11 February 2026, 6:38 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఫిబ్రవరి 15ను అధికారిక సెలవుగా ప్రకటించాలి

టీజీయూఎస్ జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు

నవగీతం, జగిత్యాల ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్రంలో బంజారా సమాజం ఆరాధ్య దైవం, సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15న రాష్ట్ర ప్రభుత్వం అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు, ప్రధాన కార్యదర్శి జరుపుల గోవింద్ లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లాది లంబాడి బంజారా ప్రజలకు ఆధ్యాత్మిక మార్గదర్శకుడిగా, సంస్కృతి పరిరక్షకుడిగా, ధర్మరక్షకుడిగా సద్గురు సేవాలాల్ మహారాజ్ నిలిచారని పేర్కొన్నారు. బంజారా జాతి అభ్యున్నతి కోసం ఆయన చేసిన త్యాగాలు, సేవ, సమానత్వం,నీతి, ఐక్యత వంటి విలువలను వారు సమాజానికి అందించారని తెలిపారు. రాష్ట్రంలో ఇతర సామాజిక వర్గాల మహనీయుల జయంతుల సందర్భంగా అధికారిక సెలవులు ప్రకటిస్తున్న నేపథ్యంలో, లంబాడి బంజారా సమాజానికి ప్రేరణగా నిలిచిన సేవాలాల్ మహారాజ్ జయంతి రోజున కూడా ప్రభుత్వ సెలవు ప్రకటించడం న్యాయసమ్మతమని వారు అభిప్రాయపడ్డారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఫిబ్రవరి 15ను అధికారిక సెలవుగా ప్రకటించాలని నునావత్ రాజు కోరారు.