బీఆర్ఎస్ సిట్టింగ్ కౌన్సిలర్ పై ఘనవిజయం
నవగీతం, జగిత్యాల ప్రతినిధి :
మున్సిపల్ సాధారణ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం వెలువడిన ఫలితాల్లో మెట్ పల్లి నుంచి ఒకటో వార్డులో కాంగ్రెస్ బోణీ కొట్టింది. ఇక్కడి నుండి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఓంకారి నవీన్ 546 ఓట్లతో ఘనవిజయం సాధించారు. ప్రత్యర్థి, సిట్టింగ్ కౌన్సిలర్ మార్గం హనుమాన్లు 415 ఓట్లు, తోకల సత్యనారాయణ 74 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన పెద్దగొండ నరేష్ కుమార్ 55 చొప్పున ఓట్లు పొందగా నోటాకు 2 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 1090 ఓట్లు పోలవగా దాదాపు సగానికి పైగా ఉన్న 546 ఓట్లు సాధించిన ఓంకారి నవీన్ ను విజేతగా ఎన్నికల అధికారులు ప్రకటించారు.
మొదటి ప్రయత్నంలోనే గెలుపు…
ఓంకారి నవీన్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి మొదటి ప్రయత్నంలోనే కౌన్సిలర్ గా గెలుపొందారు. తన తండ్రి అంజయ్య రాజకీయ వారసత్వం అందిపుచ్చుకొని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. వార్డులో మంచి పేరున్న కుటుంబానికి చెందిన ఓంకారి నవీన్ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి తనదైన శైలిలో రాజకీయం ప్రారంభించారు. తనకున్న మంచి పేరుతో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ను సాధించి ఎన్నికల బరిలో నిలిచారు. అనూహ్యంగా శుక్రవారం వచ్చిన ఫలితాల్లో కౌన్సిలర్ గా గెలుపొంది తొలిసారిగా మున్సిపల్ సమావేశ మందిరంలో అడుగుపెట్టనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్ గా ఓంకారి నవీన్ ఘన విజయం సాధించడం పట్ల వార్డు ప్రజలు, మిత్రులు, బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.