navageetam.com
Newspaper Banner
Date of Publish : 17 February 2026, 8:44 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

వైభవంగా శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు : టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు

నవగీతం , హైదరాబాద్:

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మంగళవారం ఉదయం 10: 30 నుండి 11:00 గంటల మధ్య మేష లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.వేదపండితుల మంత్రోచ్ఛారణలు,మంగళ వాయిద్యాలు,భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. అంతకుముందు ఉదయం 6.30 నుండి 8.15 గంటల వరకు స్వామివారి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, గరుడ ప్రతిష్ఠ, రక్షా బంధనం చేపట్టారు. మీన‌ లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించి, పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్టించారు. ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఆల‌యంలో ఈనెల 17 నుండి 26 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న బ్ర‌హ్మోత్స‌వాల‌ను అత్యంత వైభ‌వంగా నిర్వ‌హిస్తామ‌న్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 21న గరుడసేవ, 22న స్వర్ణరథోత్సవం, 24న రథోత్సవం, 25న చక్రస్నానం, 26న శ్రీ పుష్పయాగం జరుగనున్నట్టు వివరించారు. గరుడ సేవ రోజు భక్తుల రద్దీ నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్, జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర టెంపుల్ లోకల్ అడ్వైసరీ కమిటీ ప్రెసిడెంట్ ఏ వేంకటేశ్వరా రెడ్డి, హైదరాబాద్ టీటీడీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యూ రమేష్, ప్రముఖ పారిశ్రామికవేత్త పి.దొరస్వామి, ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.