navageetam.com
Newspaper Banner
Date of Publish : 21 February 2026, 11:33 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

వైభవంగా శ్రీ వేంకటేశ్వరస్వామి గరడసేవ

జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరుడు దర్శనంతో తన్మయత్వంలో భ‌క్తులు

టీటీడీ ఏర్పాట్ల‌పై భ‌క్తుల ప్ర‌శంస‌

నవగీతం, హైదరాబాద్:

జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శనివారం ఉదయం 8 నుండి 9 గంటల వరకు మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై శ్రీ‌నివాసుడు పల్లకీలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మోహినీ అవతారం మాయా మోహ నాశ‌నం. విశేషమైన గరుడ వాహనసేవ రాత్రి 7 గంటల నుండి అత్యంత వైభవంగా జరిగింది.స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, కేరళ కళాకారులవాయిద్యాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.

భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. ఇందుకే గరుడసేవకు ఎనలేని విశిష్టత ఏర్పడింది. గ‌రుడ వాహ‌నం స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం.పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా దాస ప్రపత్తికి తాను దాసుడనని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియచేస్తున్నారు. గ‌రుడ సేవ సంద‌ర్బంగా భ‌క్తుల సౌక‌ర్యార్థం టీటీడీ ఏర్పాటు చేసిన అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు, భ‌ద్ర‌త‌, పార్కింగ్, విద్యుత్, పుష్ప అలంకరణలు త‌దిత‌ర ఏర్పాట్ల‌పై భక్తులు ప్ర‌సంశించారు.ఈ వాహ‌న‌సేవ‌లో టీటీడీ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర టెంపుల్ లోకల్ అడ్వైసరీ కమిటీ ప్రెసిడెంట్ ఏ వేంకటేశ్వరా రెడ్డి, హైదరాబాద్ టీటీడీ ఎఈఓ యూ రమేష్, ఆలయ అర్చకులు, టెంపుల్ ఇన్పెక్టర్స్ నిరంజన్, హరికృష్ణ, మాజీ లోకల్ అడ్వైసరీ కమిటీ మెంబర్ ఏవి రమణారెడ్డి, పలువురు అధికారులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.