navageetam.com
Newspaper Banner
Date of Publish : 24 February 2026, 5:54 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు

నవగీతం, మెట్ పల్లి

బంజారా సమాజం ఆరాధ్య దైవం, సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు మెట్ పల్లి పట్టణంలో భక్తి, శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మెట్ పల్లి పట్టణ మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి ముఖ్య అతిథిగా పాల్గొని సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి మాట్లాడుతూ, సేవాలాల్ మహారాజ్ బంజారా సమాజానికి మాత్రమే కాకుండా సమస్త మానవాళికి మార్గదర్శకుడని పేర్కొన్నారు. ఆయన బోధించిన సత్యం, అహింస, సేవా భావం, సమానత్వం వంటి మహత్తర విలువలు నేటి యువతకు ఆదర్శప్రాయమని అన్నారు. సమాజంలో శాంతి, సౌహార్ద వాతావరణం నెలకొల్పడంలో సేవాలాల్ మహారాజ్ సందేశాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

అలాగే బంజారా సమాజ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్య, ఉపాధి, సంక్షేమ రంగాలలో మరింత ప్రోత్సాహం అందించేందుకు కృషి జరుగుతోందని చైర్మన్ స్పష్టం చేశారు. సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రతి సంవత్సరం మరింత వైభవంగా నిర్వహించేందుకు పట్టణ ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నీతా, ఉత్సవ కమిటీ చైర్మన్ జరుపుల రాయల్ నాయక్ , ప్రధాన కార్యదర్శి జరుపుల వసంత్,కోశాధికారి జరుపుల గోవింద్ ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు భూక్యా గోవింద్ నాయక్, టి జి యు యస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు, సర్పంచ్ గుగ్లవత్ రాజేందర్, జవహర్ లాల్ నాయక్, కౌన్సిలర్ జరుపుల శ్రీకాంత్, ఉత్తమ్ నాయక్, రాజేందర్, రమేష్,భూమా నాయక్,అమృత్ లాల్ నాయక్, ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు. భక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి జయంతి వేడుకలను ఘనంగా జరిపారు.