navageetam.com
Newspaper Banner
Date of Publish : 26 February 2026, 9:13 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

సర్పంచ్ కు ఇసుక మాఫియా బెదిరింపులు..

ఖబర్దార్ లారీతో తొక్కేస్తాం..

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వెంకట్రావుపేట గోదావరి పరివాహక ప్రాంతానికి సమీపంలోని నల్లమడుగు వద్ద జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై అభ్యంతరం తెలిపిన వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ కనుముల వెంకటేష్‌కు బెదిరింపులు ఎదురయ్యాయి. గత శుక్రవారం జేసీబీ సహాయంతో టిప్పర్ లారీల్లో ఇసుక అక్రమంగా లోడ్ చేస్తున్నారని తెలుసుకున్న సర్పంచ్ వెంకటేష్ అక్కడికి వెళ్లి ఇసుక రవాణా ఆపాలని వారిని నిలదీశారు. అక్రమంగా ఇసుక తీయడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోవడం, గ్రామ రహదారులు ధ్వంసం కావడం, భవిష్యత్తులో అభివృద్ధి పనులకు ఇసుక కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. దీనికి ఆగ్రహించిన ఇసుక తవ్వకాలలో పాల్గొన్న వ్యక్తులు ట్రాక్టర్లు, లారీతో తొక్కించి చంపేస్తామని, ఇసుక మీద పోసి చంపుతాం అని బెదిరిస్తూ అసభ్య పదజాలంతో దూషించినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ ఘటనపై పై అధికారులకు సమాచారం ఇవ్వగా, అధికారులు రెండు ఇసుక డంపులను సీజ్ చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ తనపై ప్రాణహాని బెదిరింపులు కొనసాగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మల్లాపూర్ ఎస్సై అనిల్ కుమార్‌కు సర్పంచ్ పిర్యాదు చేసినట్లు తెలిపారు. అక్రమ ఇసుక తవ్వకాలపై తక్షణ చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించాలని కోరారు.