navageetam.com
Newspaper Banner
Date of Publish : 02 March 2026, 9:13 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

అంగరంగ వైభవంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

నవగీతం, రాజన్న సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిధిలోని గూడెం గ్రామంలోని శ్రీ ఆండాళ్, పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. అంకురార్పణం సందర్భంగా రాత్రి పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ శాశ్వత చైర్మన్ చిట్నేని వెంకటేశ్వరరావు, ఆలయ అధ్యక్షులు బి బాలమల్లు, ప్రధాన కార్యదర్శి తాండ్రగిరి రావు లు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల నుండి ఆలయ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నాము.

ఇందులో భాగంగా ఈ సంవత్సరం ఏడవ వార్షికోత్సవమును ఈనెల 2 నుండి 7 వరకు అత్యంత వైభవంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాటు చేశామని అన్నారు. బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు మంగళవారం ధ్వజారోహణంతో శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తాము అని తెలిపారు. రెండవ రోజు బుధవారం ఉదయం అష్టోత్తర శతకలశాభిషేకం, సాయంత్రం ఎదుర్కోళ్ళ ఉత్సవము, దీపోత్సవము, మూడవ రోజు గురువారం ఉదయం 10 : 30 నిలకు శ్రీ ఆండాళ్, పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవము, నాలుగవ రోజు శుక్రవారం రాత్రి రథోత్సవము, ఐదవ రోజు శనివారం ఉదయం చక్రస్నానము, రాత్రి ద్వజ అవరోహణము తో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని కావున పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, పాలక మండలి సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.