navageetam.com
Newspaper Banner
Date of Publish : 02 March 2026, 4:40 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కలెక్టరేట్ లో దుద్దిల్ల శ్రీపాద రావు 87వ జయంతి

జగిత్యాల ప్రతినిధి:

మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాద రావు 87వ జయంతి సందర్భంగా సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి నిష్పక్షపాతంగా వ్యవహరించిన గొప్ప ప్రజానాయకుడని తెలిపారు. స్పీకర్ హోదాలో ఆయన చూపిన క్రమశిక్షణ, పారదర్శకత మరియు నైతిక విలువలు ప్రజాప్రతినిధులకు ఆదర్శమని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా ఆయన చిరస్మరణీయులని అన్నారు. ఈతరం యువత ఆయన సేవాభావం, నాయకత్వ లక్షణాలు మరియు ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధతను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం నాయకుల ప్రధాన కర్తవ్యమని తెలిపారు.మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు  ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారా ఆయనకు నిజమైన నివాళి అర్పించినవారమవుతామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.