అక్రమ కబ్జాలపై అఖిలపక్షం గర్జన
నవగీతం,కోరుట్ల:
కోరుట్ల పట్టణంలోని చారిత్రక గడి బురుజుల పరిరక్షణ కోసం అఖిలపక్ష నాయకులు సమరశంఖం పూరించారు. శనివారం పట్టణంలోని సి. ప్రభాకర్ స్మారక గ్రంథాలయ భవనంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పురాతన గడి పరివాహక భూముల పరిరక్షణపై విస్తృతంగా చర్చించారు. సుమారు 3 ఎకరాల 21 గుంటల విస్తీర్ణంలో ఉన్న గడి బురుజు గ్రామకంఠం భూమి అక్రమ కబ్జాకు గురవుతుండటంపై నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని వర్గాలు మున్సిపల్ అధికారుల ద్వారా సదరు భూమికి అనుమతులు పొందినట్లు సమాచారం ఉందని, ఈ అంశాన్ని అఖిలపక్ష కమిటీ గంభీరంగా పరిగణించింది. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ భూమిని రక్షించుకోవాల్సిన బాధ్యత కోరుట్ల ప్రజలందరిపై ఉందని నాయకులు స్పష్టం చేశారు. కబ్జాలను అడ్డుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని వారు ప్రకటించారు. భూముల పరిరక్షణ ఉద్యమంలో భాగంగా మార్చి 30, సోమవారం నాడు గడి బురుజుల వద్ద భారీ స్థాయిలో జన సమీకరణ చేపట్టాలని సమావేశం నిర్ణయించింది. ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని, అవసరమైతే అక్రమ నిర్మాణాలపై చట్టబద్ధంగా కోర్టులో కేసులు వేయాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు, మేధావులు మరియు పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం, సిపిఎం పట్టణ కార్యదర్శి కె. శంకర్, న్యూ డెమోక్రసీ నేత చింత భూమేశ్వర్, ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు, ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేట భాస్కర్, సమాజ్వాది పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎం.డి. ముజాహిద్, ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు ఎం.డి. రఫీ, ధర్మ సమాజ్ పార్టీ నాయకుడు బొబ్బిలి కిషోర్, తెలుగుదేశం పార్టీ కోరుట్ల నియోజకవర్గం నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాస్ బాబు, సీనియర్ నాయకుడు పోతని సత్యం, మాస్తిన్ సంఘ సభ్యుడు గుత్తుల గంగ నరసయ్య తదితరులు పాల్గొన్నారు