మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఎంపీ అర్వింద్ ధర్మపురి లేఖ
నవగీతం, మెట్ పల్లి:
రాబోయే గోదావరి పుష్కరాలు–2027 ను దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో గోదావరి నది తీర ప్రాంతాల్లో ఉన్న ఘాట్ల వద్ద సమగ్ర ఏర్పాట్లు చేపట్టాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో గోదావరి తీరం వెంట ఉన్న ఘాట్లకు పుష్కరాల సమయంలో కోట్లాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ఎంపీ తెలిపారు. ముఖ్యంగా కందకుర్తి, పోచంపాడ్, తడపాకల్, వాల్గొండ వంటి ప్రధాన ఘాట్ల వద్ద భారీగా భక్తుల రద్దీ ఉండే అవకాశముండడంతో ఈ ప్రాంతాల్లో ముందస్తుగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఘట్ ల అభివృద్ధి రహదారుల విస్తరణ, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుధ్య సదుపాయాలు, పోలీస్ భద్రత, సీసీ కెమెరాలు, వైద్య శిబిరాలు, అంబులెన్స్లు, అగ్నిమాపక సేవలు, విద్యుత్ సరఫరా, హైమాస్ట్ లైట్లు, ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, పార్కింగ్ ఏర్పాట్లు వంటి అంశాలపై ప్రభుత్వం ముందస్తుగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పుష్కరాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేసి పనులను మిషన్ మోడ్లో పూర్తి చేయాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.