navageetam.com
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 9:20 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

నీటి శుద్ధి ప్రక్రియలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి.. కలెక్టర్

నవగీతం,ఇబ్రహీంపట్నం:

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో గురువారం  తాగునీటి సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు చేపడుతున్న చర్యలను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలిస్తూ జిల్లా అధికారుల బృందం మిషన్ భగీరథ (ఆర్‌డబ్ల్యూఎస్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను సందర్శించారు.ఈ సందర్భంగా 145యం.ఎల్.డి సామర్థ్యం గల వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లోని వివిధ విభాగాలను అధికారులు పరిశీలించారు.

ఫిల్టర్ హౌస్, సెడిమెంటేషన్ ట్యాంకులు, క్లారిఫికేషన్ ప్రక్రియలు, శుద్ధి విధానాలపై సమగ్రంగా ఆరా తీశారు. నీటి శుద్ధి ప్రక్రియలో నాణ్యత ప్రమాణాలు తప్పకుండా పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్లాంట్ వద్ద నీటి ప్రవాహం, శుద్ధి ప్రక్రియ, పంపిణీ వ్యవస్థలను ప్రత్యక్షంగా పరిశీలించిన అధికారులు, ప్రజలకు అందుతున్న తాగునీరు సురక్షితంగా మరియు నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని, నిర్వహణలో నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు.అనంతరం మిషన్ భగీరథ కార్యాలయాన్ని సందర్శించి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహణ, మరమ్మత్తులు, నీటి సరఫరా అంతరాయం లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని, అందుకు అనుగుణంగా ప్రతి దశలో నాణ్యత, సమయపాలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మెట్ పెల్లి ఆర్.డి.వో నరసింహ రావు, ఈ ఈ జానకి,డి ఈ జలంధర్ రెడ్డి, తహసీల్దార్ లు, ఎంపిడివోలు, సంబంధిత శాఖల అధికారులు, ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.