navageetam.com
Newspaper Banner
Date of Publish : 12 March 2026, 3:18 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత

శ్మశానవాటిక, డంపింగ్ యార్డ్, శానిటేషన్ పరిస్థితులపై జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పరిశీలన

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గురువారం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ కేంద్రంలో ఉన్న శ్మశానవాటిక, డంపింగ్ యార్డ్ మరియు పట్టణంలోని పారిశుధ్య పరిస్థితులను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ మాట్లాడుతూ..ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా పట్టణంలో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపర్చాలని, చెత్తను సమయానికి సేకరించి శాస్త్రీయ విధానంలో నిర్వహించాలని, సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చెత్త నిర్వహణ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

డంపింగ్ యార్డ్‌ను పరిశీలించిన కలెక్టర్ చెత్త వేరు చేసే ప్రక్రియ, చెత్త నిర్వహణ విధానం, పరిసర ప్రాంతాల పరిశుభ్రతపై అధికారులతో చర్చించారు. చెత్తను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహిస్తూ పరిసర ప్రాంతాల్లో దుర్వాసన, కాలుష్యం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతను కాపాడుతూ, పర్యావరణానికి హాని కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అనంతరం కోరుట్ల పట్టణంలోని శ్మశానవాటికను సందర్శించి నీటి సౌకర్యం మరియు అవసరమైన విద్యుత్ దీపాలు మరియు పరిసరాల పరిశుభ్రత మరియు అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ప్రజలు ఉపయోగించే ప్రదేశం కావడంతో అవసరమైన సదుపాయాలను మెరుగుపర్చాలని, శ్మశానవాటికలో పరిశుభ్రతను నిరంతరం కొనసాగించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజా పాలన – ప్రగతి కార్యక్రమం లక్ష్యాలను సాధించేందుకు పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీందర్ , మున్సిపల్ సిబ్బంది మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.