నవగీతం,జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లా పరిధిలో నిర్వహించనున్న పదో తరగతి సాధారణ పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు చేయనున్నట్లు జిల్లా పోలీసు అధికారి అశోక్ కుమార్ తెలిపారు.మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు జిల్లాలోని 68 పరీక్ష కేంద్రాలలో పదో తరగతి పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో, ఆయా కేంద్రాల వద్ద ఉదయం 8:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో గుంపులుగా నిలబడరాదని సూచించారు. అలాగే పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాలలో సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధ్వని పరికరాలతో ఉరేగింపులు, ధర్నాలు నిర్వహించరాదని తెలిపారు. పరీక్షల సమయంలో కేంద్రాల సమీపంలోని అంతర్జాల కేంద్రాలు, ప్రతులు తీసే దుకాణాలు మూసివేయాలని సూచించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.