navageetam.com
Newspaper Banner
Date of Publish : 10 March 2026, 9:07 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

పారిశుధ్య పనులను సమర్థవంతంగా నిర్వహించాలి.

హెల్త్ సబ్ సెంటర్, అంగన్‌వాడి, పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.

నవగీతం, రాయికల్:

జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో పారిశుధ్య పరిస్థితులను జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మంగళవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, కాలనీలు, మార్కెట్ ప్రాంతాలు మరియు ప్రజా ప్రదేశాల్లో నిర్వహిస్తున్న శుభ్రత కార్యక్రమాలను పరిశీలించి, ఎక్కడా చెత్త పేరుకుపోకుండా నిరంతరం శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. పట్టణ ప్రజలకు శుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం కోసం పారిశుధ్య పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

అనంతరం మండలంలోని ఇటీక్యాల గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ అక్కడ నిర్మాణ దశలో ఉన్న హెల్త్ సబ్ సెంటర్, అంగన్‌వాడి కేంద్రం మరియు జెడ్పిహెచ్ఎస్ పాఠశాల భవనాల పనులను పరిశీలించారు. చేపడుతున్న నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రజలకు త్వరితగతిన ఆరోగ్య, విద్యా సేవలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం, విద్య మరియు పోషకాహార సేవలను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు.పనుల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ సమయపాలనతో పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డి ఈ ఓ  కె. రాము, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపల్ చైర్మన్, స్థానిక సర్పంచ్, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.