నవగీతం, కొడిమ్యాల
కొడిమ్యాల పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానం కొంత కాలంగా మందుబాబులకు అడ్డాగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్కు సమీపంలో ఉన్న ఈ మైదానంలో రాత్రి వేళల్లో గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సేవించి సీసాలను అక్కడే వదిలిపెడుతున్నట్లు తెలిపారు.కొన్ని సందర్భాల్లో సీసాలను పగుల గొట్టడంతో మైదానంలో గాజు ముక్కలు చెల్లాచెదురుగా పడివుండి ఉదయం వాకింగ్కు వచ్చే వారికి ఒకరిద్దరి కాళ్ళకు గుచ్చుకున్నాయని చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు.సెలవు రోజుల్లో చీకటి పడిందంటే చాలు పరిస్థితి మరింత దారుణంగా ఉంటోందని, విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ఆవరణలో మద్యం సీసాలు, పగిలిన గాజు ముక్కలు కనిపించడం పట్ల తక్షణ చర్యలు తీసుకుని మందుబాబుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.