navageetam.com
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 11:03 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మానవత్వానికి నిలువుటద్దం హెడ్ కానిస్టేబుల్ నల్లాల లక్ష్మీరాజం

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నల్లాల లక్ష్మీరాజం ఆకస్మిక మరణం జిల్లా పోలీస్ శాఖకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.విధి నిర్వహణలోనే కాకుండా, మరణానంతరం కూడా తన అవయవాలను దానం చేసి మరో ఇద్దరికి ప్రాణదాతగా నిలిచిన ఆయన, పోలీస్ అంటే కేవలం రక్షణ మాత్రమే కాదు, మానవత్వానికి ప్రతీక అని మరోసారి చాటిచెప్పారు.ఇలాంటి దుఃఖ సమయంలో కూడా ఆయన భార్య శ్రీమతి రాధ చూపిన ధైర్యం, తీసుకున్న గొప్ప నిర్ణయం సమాజానికి ఆదర్శప్రాయంగా నిలిచింది. భర్త మరణంతో పుట్టెడు శోకంలో ఉన్నప్పటికీ, ఆయన అవయవాలను దానం చేయాలని ఆమె తీసుకున్న నిర్ణయం అత్యంత ప్రశంసనీయమైనది.లక్ష్మీరాజం రెండు కిడ్నీలను దానం చేయడం ద్వారా ఇద్దరు వ్యక్తులకు పునర్జన్మ లభించి, వారి కుటుంబాల్లో ఆనందం నింపింది.మరణించినా మరొకరి రూపంలో జీవించడం కంటే గొప్ప సాఫల్యం మరొకటి లేదని ఈ సంఘటన స్పష్టంగా తెలియజేస్తోంది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, లక్ష్మీరాజం మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన చేసిన అవయవ దానం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.